ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ్లల్లా రామాలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం రోజు ఘనంగా ప్రారంభమైంది. ఆలయ అర్చకులు రాముడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాముడ్ని దర్శించుకొని, తన్మయత్వంలో మునిగిపోయారు.
ప్రప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాంలల్లా ఆస్థానాన్ని పూలతో అలంకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన బంగారం, వెండి తీగలతో ఎంబ్రాయిడరీ చేసిన పీతాంబర వస్త్రాన్ని రాముడికి అలంకరించారు.మహా అలంకారం అనంతరం మధ్యాహ్నం 12:20 గంటలకు స్వామివారికి మహా హారతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి 56 వంటకాలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ వేడుకల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. మహా హారతి అనంతరం హెలిప్యాడ్ నుంచి నేరుగా రామాలయానికి చేరుకొని, వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి రాముల వారికి హారతినిచ్చారు. దర్శనం, పూజల అనంతరం సీఎం యోగి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. తదనంతరం సాధు సంతులతో కలిసి అక్కడే భిక్ష స్వీకరించారు.