వయసు ఆరేళ్లు... వెయ్యి కిలోమీటర్ల పరుగుతో అయోధ్యకు..

VSK Telangana    09-Jan-2025
Total Views |

Mohabbat Runner
 
భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్‌. ఈ చిన్నారికి రామ్‌లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను ఉంటున్న పంజాబ్‌ నుంచి అయోధ్యకు పరుగున ప్రయాణమయ్యాడు. 
 
నెల రోజులకుపైగా సమయం
 
పంజాబ్ నుంచి యూపీలోని అయోధ్యకు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంది. ఇంతదూరం ప్రయాణించేందుకు మొహబ్బత్‌ ఎటువంటి బస్సు,రైలును ఉపయోగించలేదు. పరిగెడుతూనే గమ్యాన్ని చేరుకున్నాడు. ఇందుకోసం మొహబ్బత్‌కు నెల రోజులకుపైగా సమయం పట్టింది. ఎలాగైతేనేం చివరకు జనవరి 7 నాటికి అయోధ్య చేరుకుని, సరికొత్త రికార్డు సృష్టించాడు.
 
ఫజిల్కా నుంచి ప్రయాణం
 పంజాబ్‌లోని ఫజిల్కా నుంచి మొహబ్బత్‌ తన పరుగును ప్రారంభించాడు. తొలుత ఓ సైనికాధికారి ఆ చిన్నారి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తరువాత మొహబ్బత్ ఒక నెలా ఇరవై మూడు రోజులు పరిగడుతూ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో మొహబ్బత్‌ తల్లిదండ్రులు కూడా అతని వెంట ఉన్నారు. వారు ఈ ప్రయాణ సమయంలో అయోధ్య ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో టచ్‌లో ఉన్నారు. మొహబ్బత్‌ను పరుగును చూసి దారిలోని పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ చిన్నారికి స్వాగతం పలుకుతూ, ‍ప్రశంసలు కురిపించారు.
 
పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశం 
మొహబ్బత్ తాను పరుగుసాగిస్తూ మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాడు. అలాగే పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశమిచ్చాడు. ఈ సందర్భంగా మొహబ్బత్ తండ్రి రింకూ కుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు యూకేజీ చదువుతున్నట్లు తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలను చూశాక, మెహబ్బత్‌ అయోధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మొహబ్బత్‌ అయోధ్యకు పరుగు ప్రారంభించాడన్నారు.
 
ప్రతిరోజూ 20 కిలోమీటర్ల దూరం..
మొహబ్బత్ రాముని భక్తుడని, ప్రతిరోజూ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిగెడుతూ, అయోధ్యకు చేరుకున్నాడన్నారు. గతంలో మొహబ్బత్‌ పంజాబ్‌లోని అబోహర్ నుండి లూథియానాకు పరుగుసాగించాడన్నారు. అప్పుడే అయోధ్యకు పరిగెత్తాలని నిర్ణయించుకున్నాడని రింకూ కుమార్‌ తెలిపారు. కాగా తమ కుమారుడిని అందరూ రన్ మెషిన్ మొహబ్బత్ అని పిలుస్తున్నారన్నారు. తమ కుమారుడు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారుడు అవుతాడని చాలామంది అంటున్నారని రింకూ కుమార్‌ పేర్కొన్నారు.