కేరళలోని మునంబం ప్రాంతంలో వక్ఫ్ చేసిన హంగామా తెలిసిందే. దీంతో రిటైర్డ్ జస్టిస్ సీఎన్ రామచంద్రన్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ అక్కడ పర్యటించింది.దీంతో వక్ఫ్ పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న స్థానికులకు కొంత ఉపశమనం లభించినట్లైంది. ఈ సందర్భంగా కమిషన్ వక్ఫ్ బాధితులతో మాట్లాడింది. వారి సమస్యలను సావధానంగా విన్నది. వక్ఫ్ బోర్డు తమ భూములను క్లెయిమ్ చేసుకుందని, దీంతో తమ జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని అందరూ ముక్తకంఠంతో కమిషన్ ముందు ఏకరువు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా ఆ భూములు తమవేనని, హక్కు కూడా మాకే వుందని, ఉన్నట్లుండి వక్ఫ్ క్లెయిమ్ చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిషన్ తొలుత మునంబంలోని పరిస్థితిని సమగ్రంగా మదింపు చేయడంతో తమ పర్యటనను ప్రారంభించింది. వివాదాస్పద ఆస్తులను, సముద్రపు కోత వల్ల దెబ్బతిన్న ప్రాంతాలనూ సందర్శించింది. మునంబం భూమి రక్షణ కౌన్సిల్కు చెందిన మహిళలు న్యాయం కోరుతూ 80 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ధర్నా శిబిరానికి కూడా జస్టిస్ రామచంద్రన్ వెళ్ళారు.
సమస్య చాలా సంక్లిష్టంగా ఉందని జస్టిస్ రామచంద్రన్ గుర్తించారు. చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారి కేసులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ వివాదంలో ప్రధాన భాగస్వాములైన కేరళ వక్ఫ్ బోర్డ్, ఫరూఖ్ కాలేజ్ ట్రస్ట్ వారి వాదనలు కూడా కమిషన్ విననుంది.మునంబం అనేది కేరళలో సముద్ర తీరాన ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ ప్రజలు ఐదారు దశాబ్దాల క్రితం భూములు కొనుక్కుని ఇళ్ళు కట్టుకుని జీవిస్తుండగా, ఆ ఆస్తులన్నీ తమవేనంటే కేరళ వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. దాంతో సమస్య మొదలైంది.
ఆ ప్రాంతంలో చాలా కుటుంబాలు ఎన్నో దశాబ్దాలుగా జీవిస్తున్నాయని, కొన్ని ప్రాంతాలు సముద్రపు కోతకు కూడా గురయ్యాయనీ జస్టిస్ రామచంద్రన్ నిర్ధారించుకున్నారు. కమిషన్ హియరింగ్లు జనవరి 10 నుంచీ మొదలవుతాయి. కమిషన్ తన నివేదికను ప్రభుత్వ వర్గాలకు ఫిబ్రవరిలో సమర్పిస్తుంది.