
ఈ సందర్భంగా కృతజ్ఞతా పురస్కారాన్ని స్వీకరిస్తూ.. మోహన్ భాగవత్ మాట్లాడారు. సమాజం కోసం పనిచేసే సంఘ కార్యంలో కృతజ్ఞత లేదా అహంకారం అనేవి వుండవన్నారు.సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సుసంపన్నమవుతుంది కాబట్టే, సంఘ్ యావత్ సమాజాన్ని సంఘటితం పరచాలని పని చేస్తోందని వివరించారు. దేశం బలంగా వున్నప్పుడే ప్రపంచంలో ఆనందం, శాంతి వుంటాయని పునరుద్ఘాటించారు.
అయితే.. సంఘ్ మాత్రమే దేశ హితం కోసం పాటుపడుతుందని తాము చెప్పమని, కానీ.. సమాజం బలంగా నిలబడినప్పుడే దేశం కూడా నిలబడుతుందన్నదే తమ విశ్వాసమని ప్రకటించారు. కష్ట సమయాల్లో సమాజం ఆరెస్సెస్ కి అండాదండా అందించిందని, దాని కారణంగా సంఘ్ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.
స్వయంసేవకులు తమ ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి, సంఘ్ ను నిర్మించారని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సంఘ్ అన్న మర్రి చెట్టును విస్తరించడానికి తమ జీవితాలను కూడా త్యాగం చేశారన్నారు. ఇందులో భాగంగానే హెడ్గేవార్, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రచారక్ గా వుండిపోయారని, అలాగే గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కూడా స్వయంసేవకలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, సంఘాన్ని నిర్మించారన్నారు. వారందరికీ కృతజ్ఞతను ప్రకటించాలన్నారు. కష్ట నష్టాలు, సుఖ దు:ఖాలు ఎదురైనప్పుడు కూడా స్వయంసేవక్ పూర్తి చిరునవ్వుతోనే సమాజ కార్యాన్ని చేస్తారన్నారు.