ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం దక్కింది. తమ దేశ అత్యున్నత పురస్కారం ”ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్”ను ప్రధానికి ఆ దేశ ప్రధాని నవీన్ రామ్గులాం ప్రకటించారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. ఈ సందర్భంగా బీహార్కు చెందిన ఆహార పదార్థం మఖానాను అధ్యక్షునికి, బెనారస్ సిల్క్ చీరను ఆయన సతీమణికి ప్రధాని బహూకరించారు.
మారిషస్ పర్యటనలో ఉన్న మోదీ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం, ఆయన సతీమణి వీణా రామ్గులాంలకు ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)’ కార్డులు ప్రకటించారు. పర్యటనలో భాగంగా అక్కడున్న భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మారిషస్కి వచ్చానని గుర్తు చేసుకున్నారు.
“అప్పటికీ హౌలీకి పది రోజులే ఉంది. ఈ సారి హౌలీ రంగులను నాతో పాటు భారత్కు తీసుకెళ్తా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ప్రదేశంలా అనుభూతి కలుగుతుంది. మనమంతా ఒకే కుటుంబం” అంటూ ప్రసంగించారు. అనంతరం.. తనను అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన మారిషస్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
మారిషస్ను కేవలం భాగస్వామి దేశంగా కాకుండా భారతదేశ విస్తృత కుటుంబంలో భాగంగా అభివర్ణించిన మోదీ, ద్వీప దేశాన్ని భారతదేశం, గ్లోబల్ సౌత్ మధ్య కీలకమైన వారధిగా అభివర్ణించారు. పోర్ట్ లూయిస్లో జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “మారిషస్ ‘మినీ ఇండియా’ లాంటిది” అని ప్రధాని పేర్కొన్నారు.