చైనాకు భారత్పై ప్రేమ పొంగుకొస్తోంది. పొరుగు దేశం చైనాకు భారత్పై ప్రేమ పొంగుకొస్తోంది. హఠాత్తుగా స్నేహం చేయాలని తహతహలాడుతోంది. భారత్తో నిత్యం కయ్యానికి కాలుదువ్విన చైనా ఇప్పుడు వెనక్కి తగ్గుతోంది. అమెరికా అధ్యక్షుడ ట్రంప్ విధించిన భారీ సుంకాలు చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి.
ట్రంప్ ఇప్పటికే 125శాతం సుంకాలు వేశారు. చైనా కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకం విధించింది. అమెరికా వేసిన 125 శాతం సంకాలతో చైనా వస్తువులను అమ్ముకోవడం కష్టంగా మారింది. అమెరికాలో అమ్మకాలు తగ్గిపోతే చైనా వస్తువులను ఎక్కడ అమ్ముకోవాలి? ప్రస్తుతం వారి ముందున్నది ఒక్కటే మార్గం.. అదీ భారత్.అమెరికా జనాభా 40 కోట్లు ఉంటే, భారత్ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. అమెరికాలో డాలర్లు ఎక్కువ ఉండొచ్చు కానీ, భారత్లో కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ వస్తువులు అమ్మితే చైనాకు లాభాలు కురుస్తాయి. అందుకే చైనా ఇప్పుడు భారత్ ను బుజ్జగించడానికి యత్నిస్తోంది.
భారత్లో తన మార్కెట్ విస్తరించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. భారీ సుంకాలు తగ్గించుకుంటే కాస్త ఊరట లభిస్తుందని చైనా ఆశిస్తోంది. మొత్తంగా చైనా వెనకడుగు వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు.
ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ ‘‘ఢిల్లీ, బీజింగ్ కలిసే పనిచేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.
“సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సానుకూలంగా స్పందించారు.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. వాణిజ్య రంగాలలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటే ముందుకు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.
మరోవంక, అమెరికా రక్షణ దళాలకు మాత్రం భారత్తో స్నేహం చాలా అవసరం. చైనాను కట్టడి చేయాలంటే తైవాన్, వియత్నాం, భారత్ ఈ మూడు దేశాలు కీలకం. అందుకే అమెరికాకు భారత్ మిత్రుడుగా ఉండటం తప్పనిసరిగా మారుతోంది.