నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారని ఆయన స్పష్టం చేశారు. నక్సల్స్ను రూపుమాపడంలో సీఆర్పీఎఫ్ వెన్నుముఖగా నిలిచినట్లు ఆయన కొనియాడారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్కు చెందిన 86వ రైజింగ్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
దేశం నుంచి నక్సలైట్లను ఏరివేయడంలో సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్) తోపాటు సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) యూనిట్ భద్రతా దళాల్లో ప్రత్యేకంగా పనిచేస్తున్నది.
గెరిల్లా, జంగిల్ యుద్ధాల్లో ఆ దళం ఆరితేరి ఉన్నది. నక్సల్స్ను ఎదుర్కోవడంలో కోబ్రా దళం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నదన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసినట్లు షా వెల్లడించారు. దీని వల్లే ఈ ప్రాంతాల్లో హింస తగ్గిందని పేర్కొన్నారు. సుమారు 70 శాతం హింస తగ్గినట్లు చెప్పారు. ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు.
దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ చేసిన సేవలు అసాధారణమైనవని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడటంలోనైనా, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పాలన్నా, నక్సలైట్లను ఎదుర్కోవాలన్నా సీఆర్పీఎఫ్ చేస్తున్న పోరాటం అసామాన్యమైందని హోంమంత్రి తెలిపారు. ప్రతి అచీవ్మెంట్లో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ సాధించిన అతి గొప్ప విజయాల నక్సలిజాన్ని పారద్రోలడమే అని తెలిపారు.
కోబ్రా కమాండోల గురించి విన్నప్పుడు నక్సల్స్ వణికిపోతున్నారని చెప్పారు. ధైర్యానికి ప్రతీకగా కోబ్రా బెటాలియన్ నిలిచిందని పేర్కొంటూ 86వ రైజింగ్ డే సందర్భంగా కోబ్రా యూనిట్ జవాన్లకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు షా వెల్లడించారు. వారి నేతృత్వంలో సీఆర్పీఎఫ్ జవాన్లు నక్సలిజం రూపుమాపడంలో ముందుకెళ్లినట్లు చెప్పారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశం నుంచి నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని షా తెలిపారు. దేశం ఈ ప్రతిజ్ఞ తీసుకున్నదని, ఇక సీఆర్పీఎప్ వెన్నుముఖగా ఉందని పేర్కొన్నారు.