చిత్తూరు నగరంలో దారుణం జరిగింది. హిందూ యువకుడ్ని వివాహం చేసుకున్న ఓ యువతి కన్నవారింట అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తన భార్యను పుట్టింటి వారికి అప్పగించిన గంటలోనే చంపేసి, మార్చురీలో శవాన్ని చూపించారంటూ మృతురాలి భర్త తీవ్రంగా విలపించారు. ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది. బాలాజీనగర్ కాలనీకి చెందిన షౌకత్అలీ, ముంతాజ్ ల కుమార్తె యాస్మిన్ బాను (26) ఎంబీఏ పూర్తిచేయగా, పూతలపట్టు మండలానికి చెందిన కోదండ రామ్, బుజ్జిల కుమారుడు సాయితేజ బీటెక్ చదివారు. కాలేజీ రోజుల్లో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరు పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఎస్సీ వర్గానికి చెందిన సాయితేజతో వివాహానికి యాస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రాణహాని ఉందని భావించిన ఇద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని అదే నెల 13న తిరుపతి డీఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
నాన్నకు అనారోగ్యమని పిలిచి..
రెండు నెలలుగా వీరి సంసారం సాఫీగానే సాగుతోంది. అయితే, కొద్దిరోజులుగా యాస్మిన్ కుటుంబీకులు ఫోన్లో మాటలు కలిపి తండ్రి షౌకత్అలీకి ఆరోగ్యం సరిగా లేదని ఓసారి వచ్చి, చూసి వెళ్లాలని యాస్మిన్ ను పదేపదే కోరారు. ఉదయం సాయితేజ.. తన భార్యను చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలి వద్ద ఆమె సోదరుడి కారులో ఎక్కించి, తల్లిగారింటికి పంపారు. కాసేపటికే సాయితేజ తన భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా కలవకపోవడంతో నేరుగా వారి ఇంటికి వెళ్లాడు. యాస్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాస్పత్రి శవాగారంలో ఉందని కుటుం బీకులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఆందోళనతో అక్కడికి వెళ్లిన సాయితేజ.. మార్చురీలో భార్య శవాన్ని చూసి బోరున విలపించారు. మతాలు, కులాలు వేరు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు తమ పెళ్లిని వ్యతిరేకించారని, తుదకు తన భార్యను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయితేజ రోదించారు. మరోవైపు యాస్మిన్ తండ్రి, ఆమె పెద్దమ్మ కొడుకు (సోదరుడు) లాలూ పరారయ్యారు. చిత్తూరు ఇన్ ఛార్జి డీఎస్పీ ప్రభాకర్, టూటౌన్, వనౌన్ సీఐలు నెట్టి కంఠయ్య, మహేశ్వర్లు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.