హిందువుగా వద్దు... కాని కుల ప్రయోజనాలు, రక్షణ కావాలి

VSK Telangana    03-May-2025
Total Views |
 
religion conversion
 
హిందూ మతం వద్దని, హిందువుల్లోని కులవ్యవస్థ తమకు వద్దని అన్యమతాలలోకి వెళ్ళిపోయిన కొందరు వ్యక్తులు, మతమార్పిడికి ముందు తామున్న కులాలకు సంబంధించి రిజర్వేషన్ తదితర ప్రయోజనాలను మాత్రం వదులుకోలేకపోతున్నారు. ఇలాంటివారు బయటకు హిందువులుగా జీవిస్తూ వ్యక్తిగతంగా లేదా కుటుంబపరంగా అన్యమతాన్ని అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో బయటకి వస్తున్నాయి. వదిలేసుకున్న కులం నుంచి సైతం తప్పుడు మార్గంలో ప్రయోజనాలను పొందడమన్నది ఆ కులంలో ఇప్పటికీ ఉన్నవారిని దోచుకోవడమే... ఇదొక తప్పయితే, మరీ ముఖ్యంగా ఎస్సీ, కులాలను వదిలేసి మతమార్పిడి అయినవారు ఎస్సీ-ఎస్టీ వేధింపుల చట్టం నుంచి రక్షణను ఆశిస్తూ... ఈ చట్టాన్ని ఇతరులపై ప్రయోగించి వారిని వేధిస్తూ మరింత దారుణమైన తప్పులకు పాల్పడుతున్నారు.
 
భారతదేశపు రిజర్వేషన్ల చట్టం ప్రకారం అన్యమతాల్లోకి వెళ్లిన వ్యక్తులకు మతమార్పిడికి ముందున్న కులం ఉండదు. హిందూ మతాన్ని వదిలేసుకున్న రోజునే తమ కులాన్ని కూడా వదిలేసుకున్నట్టే.. తమ మతంలో కులం, కుల వివక్ష లేదని చెప్పి హిందువులను మతం మార్చుతున్నాయి. అయినప్పటికీ మతమార్పిడి జరిగిన వ్యక్తులు... మరీ ముఖ్యంగా ఎస్సీ- నుంచి మతం మారినవారు, తామే వద్దనుకుని వదిలేసిన ఈ కులాల నుంచి అన్యాయంగా లాభాలు పొందుతూ, ఒకనాటి తమ సహచరులైన ఎస్సీ యొక్క రిజర్వేషన్ ను దోచుకుంటూ, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టాన్ని సైతం దుర్వినియోగం చేయడాన్ని కోర్టులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అయినప్పటికీ చాలామంది తీరు మారడం లేదు.
 
నిజానికి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే ఆ వ్యక్తులు ఎస్సీ హోదా కోల్పోయి బీసీ-సీ కేటగిరిలోకి వస్తారు.
 
తాజాగా ఏం జరిగిందంటే.. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ 2021లో చందోలు పోలీసులకు ఇదే గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి సహా ఐదుగురిపై ఒక ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పాస్టర్ ఆనంద్ క్రైస్తవుడని, పదేళ్ళుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారని, ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారని, క్రైస్తవంలోకి మారిన ఈయనకి ఎస్సీ కుల హోదా ఉండదని, ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని చెప్పి గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు కొట్టేయాలని నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్‌ వాదనలు వినిపించారు. కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని గుర్తు కూడా చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరని, నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొన్నారు.
 
మూడేళ్ళ కిందట ఇదే గుంటూరు జిల్లాలో ఇటువంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. నాటి గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. క్రైస్తవ ఆచార వ్యవహారాలు పాటిస్తూ, హార్వెస్ట్ ఇండియా అనే క్రిస్టియన్ సంస్థను నిర్వహిస్తున్న సురేష్ కుమార్, హెనీ క్రిస్టినా దంపతులు షెడ్యూల్ కుల హోదాకు అర్హులు కాదని స్పష్టం చేసింది.
 
కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో నాలుగేళ్ళ క్రితం అక్రమంగా ఐఎంబీ చర్చి నిర్మాణం, ఎస్సీ కులస్థులను క్రైస్తవ మతంలోకి మార్చడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన ప్రజలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే న్యాయపరమైన పోరాటం సాగిస్తామని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తేల్చిచెప్పారు.
 
ఇలా ఎన్నో సంఘటనలు అధికారుల, కోర్టుల వరకూ వస్తుండగా... న్యాయమూర్తులు పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ చట్టం పట్ల భయం లేకుండా కొందరు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. 2021లో ఈ అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చినప్పుడు నాటి న్యాయశాఖమంత్రి రవిశంకర్ మరోసారి స్పష్టం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనేకమంది క్రైస్తవంలోకి మారుతున్నప్పటికీ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని రాజ్యసభలో సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా క్రైస్తవం, ఇస్లాం మతాలను స్వీకరించిన ఎస్సీలు తమకు రాజ్యాంగం కేటాయించిన రిజర్వేషన్లు కోల్పోతారని, అటువంటి వ్యక్తులు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించేందుకు చట్టబద్ధమైన అవకాశం లేదని స్పష్టం చేశారు. మతం మారిన ఎస్సీలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి పోటీకి దిగుతున్న సమయంలోనే వారు మతం మార్చుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులకు సాక్ష్యాలతో ధ్రువీకరిస్తే వారి నామినేష్లను తిరస్కరించవచ్చని చెప్పారు.
 
ఆ తరువాత, మ‌తం మారి ఎస్సీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు కఠినతరం చేసేందుకు చట్టాలను సవరించాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కూడా కోరింది. ఆయనకు నాడు అందజేసిన తన నివేదికలో క్రైస్తవంలోకి మారి కూడా హిందూ ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన రిజ‌ర్వేష‌న్లను రాజకీయ లబ్ది కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలను ఫోరమ్ పొందుపరిచింది.
 
క్రైస్తవాన్ని పాటిస్తున్న ఎస్సీ ప్రజా ప్రతినిధుల విషయంలో సైతం చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఆధారం చేసికుని ఇలాంటి వ్యక్తులిచ్చే ఫిర్యాదులపై పోలీసులు కేసులు పెట్టడం, ప్రభుత్వ ఉన్నతాధికారులు సర్టిఫికెట్లు జారీ చేయడం, ఫిర్యాదులపై తగు సమయంలో చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి చేటుగా మారింది.
 
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి.. క్రైస్తవంలోకి మారి ఎస్సీ నియోజకవర్గాల నుండి నామినేషన్ దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులతో సహా మొత్తం 17 మందిపై అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. తరువాత తెలంగాణలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే ఎస్సీ హోదా దుర్వినియోగం అంశంలో కూడా జిల్లా విచారణ కమిటీ అధ్యక్షడిగా బాధ్యతలు కలిగిన జాయింట్ కలెక్టరుకు పలుమార్లు ఫిర్యాదు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ గుంటూరు జిల్లా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ హోదా దుర్వినియోగం అంశంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదుపై 2019లో గుంటూరు జాయింట్ కలెక్టర్ విచారణ జరిపినప్పటికీ తగు సమయంలో చర్యల తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా జాప్యమే. వీటన్నిటినీ అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పేర్కొంది.
 
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తన నివేదికతో పాటు అప్పటికే అమలులో ఉన్న చట్టాల్లో ఈ క్రింది సవరణలు చేయాల్సిందిగా కోరింది:
 
1. క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంలో పోటీకి దిగే అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించి, ఎస్సీ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం రిటర్నింగ్ అధికారులకు కల్పిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో సవరణలు చేయాలి.
 
2. హిందువు ఎవరు, ఎవరు ముస్లిం, ఎవరు క్రైస్తవులు అనే దానికి కచ్చితమైన నిర్వచనం ఇవ్వాలి. అలాగే ఒక హిందువు క్రైస్తవంలోకి మారినా లేదా క్రైస్తవులు హిందుత్వంలోకి మారినా ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ప్రామాణికతల గురించి వివరించాలి.
 
3. పేరుకు మతానికి సంబంధం లేదని, బైబిల్ చదివి చర్చికి వెళ్లినంత మాత్రాన క్రైస్తవుడు కాదని, మతం మార్చుకున్నంత మాత్రాన పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కోర్టులు తరచూ చేస్తున్న ప్రకటనలను సాకుగా తీసుకుని భారీ ఎత్తున ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, వీటిని అరికట్టాలి.
పై సూచనలు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్.. వీటిని పరిగణలోకి తీసుకుని నిజమైన ఎస్సీలకు సామాజిక న్యాయం చేయడం ద్వారా రాజ్యాంగ నిర్మాతల కలలను సాకారం చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరింది.