భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన నకిలీ వార్తలు వచ్చిపడుతున్నాయి. అందులో భాగంగానే ఏటీఎంలు మూసేస్తున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసేస్తారంటూ తెగ ప్రచారం అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది ఫేక్ వార్త అని, తప్పుడు వార్త అని తేల్చి చెప్పింది. ఏటీఎంలు ఎప్పటిలాగే పనిచేస్తాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది. అలాగే ఇలాంటి అసత్యపు వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని సూచించింది.