
పహల్గామ్ ఉగ్రదాడులకు స్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నానాటికి తీవ్రతరమవుతున్నాయి. మంగళవారం-గురువారం మధ్య అర్ధరాత్రి వేళ ఒక వైపు పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్, క్షిపణి దాడి ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ భారత సైన్యం బాంబుల మోత మోగిస్తూనే ఉంది. దీంతో దాయాది పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియక అర్థంకాని పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి భారతదేశం జరిపిన ఎదురు దాడిలో పాకిస్థాన్కు కోలుకోలేని షాక్ తగిలింది. అక్కడి రెండు ప్రధాన వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్ పూర్తిగా ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సర్గోధా, ఫైసలాబాద్ పరిధిలోని గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశామని తెలిపారు. అంతేగాక పాకిస్థాన్లోని పంజాబ్ ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్ను కూడా క్యాప్చర్ చేసి పేల్చివేసినట్లు భారత సైన్యంలోని ఉన్నతాధికారులు సమాచారమిచ్చారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ చేసిన ఎదురుదాడులపై సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’ వేదికగా ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. ‘పాకిస్తాన్ సాయుధ బలగాలు 2025 మే 08, 09 తేదీల మధ్య రాత్రి వేళ పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రితో అనేక దాడులను మొదలుపెట్టాయి. జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. వెంటనే భారత భద్రతా దళాలు అప్రమత్తమై పాక్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే ఎదురుకాల్పులతో తగిన జవాబిచ్చారు. భారతదేశం సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి భారత సైన్యం కట్టుబడి ఉంది. పాకిస్తాన్ చేసే దుర్మార్గపు కుట్రలకు గట్టి జవాబునిస్తాం’ అంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పూర్తిగా పక్కనపెట్టి జమ్మూకశ్మీర్లో ప్రజలు, సైనిక వాహనాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి నియంత్రణ రేఖ వెంట ఉధంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్కు చెందిన 50 డ్రోన్లను భారత్ కూల్చింది. పాకిస్తాన్ డ్రోన్లను L70 గన్స్, ZU-23 MM, అధునాతన ఆయుధాలతో భారత్ నాశనం చేసింది.