‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్ణయాత్మక చర్య.. కేంద్రాన్ని, సైన్యాన్ని ప్రశంసించిన ఆరెస్సెస్

VSK Telangana    09-May-2025
Total Views |
 
RSS
 
పహల్గాంలో హిందూ పర్యాటకులపై అనాగరికంగా దాడి చేసిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ అనే నిర్ణయాత్మక చర్య తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రశంసించింది. అలాగే సాయుధ దళాలు వేగంగా స్పందించి, రంగంలోకి దిగాయని కూడా కొనియాడింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేరిట శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదలైంది.
 
ఈ సందర్భంగా భారత దేశ నాయకత్వాన్ని ఆరెస్సెస్ మనస్ఫూర్తిగా అభినందించింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి, అలాగే దేశ ఆత్మ గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచే అత్యంత ఆవశ్యకమైన చర్యగా ఆపరేషన్‌ను అభివర్ణించింది.
 
 
ఆర్ఎస్ఎస్ ప్రకటనలో...
 
‘‘కేంద్ర ప్రభుత్వానికి, భారత జవాన్లకు అభినందనలు. పహల్గామ్ వద్ద నిరాయుధులైన పర్యాటకులపై  జరిగిన పిరికిపంద దాడి తర్వాత పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు, వారికి వత్తాసు పలికే వ్యవస్థపై ఆపరేషన్ సిందూర్‌తో కేంద్రం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని అభినందిస్తున్నాం. ఈ చర్య బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడింది. అలాగే దేశ ఆత్మ గౌరవాన్ని, ధైర్యాన్ని మరింత పెంచింది. పాక్‌లోని ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్థలపై సైనిక చర్య తీసుకోవడం దేశ భద్రతకు అవసరమని, అత్యంత అనివార్యమని కూడా మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం. ఈ సంక్షో భ సమయంలో దేశం మొత్తం, ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతుగా నిలుస్తుంది. భారత సరిహద్దులోని మతపరమైన ప్రదేశాలు, పౌర నివాసాలపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నాం. అలాగే ఈ క్రూరమైన, అమానవీయమైన దాడులలో బాధితులైన కుటుంబాలకు హృదయ పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సవాలుతో కూడిన సమయంలో ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఇచ్చే సూచనలను పౌరులు తూచ తప్పకుండా పాటించాలని ఆరెస్సెస్ విజ్ఞప్తి చేస్తుంది. దీనితో పాటు పౌర విధిని నిర్వర్తించే సమయంలో అందరమూ జాగ్రత్తగా వుండాలి. సామాజిక ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీయడానికి దేశ వ్యతిరేక శక్తులు చేసే కుట్రలను ఏమాత్రం అనుమతించొద్దు. పౌరులందరూ దేశభక్తిని ప్రదర్శించాలి. అవసరమైన చోట సైన్యం, అధికార యంత్రాంగానికి సహకరించడానికి సిద్ధంగా వుండాలి. ఐక్యతను, భద్రతను కాపాడడానికి చేసే అన్ని ప్రయత్నాలనూ బలోపేతం చేయాలి’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సూచించింది.