సూరేపల్లి సుజాతపై ప్రజల ఆగ్రహం.. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

VSK Telangana    09-May-2025
Total Views |

SUJATHA 
 
ఆపరేషన్ సిందూర్ ను, భారత జవాన్లను అవమానపరుస్తూ పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్శిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయమూ, సందర్భమూ ఏమీ లేకుండా సెటైర్లు వేయడం ఏంటని మండిపడుతున్నారు. విద్యా కమిషన్ సభ్యురాలిగా వున్నారని, ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, విద్యా కమిషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏబీవీపీ కూడా శాతవాహన యూనివర్శిటీ వీసీకి ఫిర్యాదు చేసింది. సూరేపల్లి సుజాతపై చర్యలు తీసుకోవాలని వారు వీసిని కోరారు. 
 
ఆపరేషన్ సిందూర్ పై ఆమె స్పందిస్తూ... ‘‘సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా ? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని… యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు’’ అంటూ ఆమె తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్ వివిధ సోషల్ మీడియా వేదికలపై వైరల్‌ గా మారింది. దీనితో ఆ పోస్టుపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ను ఎగతాళి చేసిన ప్రొఫెసర్ సుజాత ముమ్మాటికి దేశ ద్రోహి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

SUJATHA2 
మరోవైపు ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ సీరియస్ అయ్యింది. ఫేస్ బుక్ మీడియా ద్వారా ఆపరేషన్ సిందూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, జవాన్లను కించపరిచేలా చేసిన ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకి బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. మరోవైపు బీజేపీ యువ మోర్చా ఆందోళన కూడా నిర్వహించింది. సుజాత దిష్టిబొమ్మను దగ్ధం చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు.
 
ఇక.. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా దీనిపై స్పందించారు. ఆపరేషన్ సిందూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ విష్ణుదేవ్ వర్మకి, సీఎం రేవంత్ కి లేఖలు రాశారు. ఆమె వ్యాఖఱ్యలు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా, సైనికుల ఆత్మ స్థైర్యాన్ని కించపరిచేలా వున్నాయన్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా, విద్యా రంగానికి మార్గనిర్దేశం చేసే స్థాయిలో వున్నారని, అలాంటి వ్యక్తి బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు.

SUJATHA23 
 
ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సూరేపల్లి సుజాతపై మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ సిందూర్ ను యావత్ ప్రపంచం అభినందిస్తుంటే తెలంగాణలోని కొందరు అర్బన్ నక్సలైట్లు దేశద్రోహ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యా కమిషన్ సభ్యురాలైన సుజాత చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుందా? లేక ఖండిస్తుందా? అని ప్రశ్నించారు. సరిహద్దుల్లో కొందరు ఉగ్రవాదులు మనపై దాడి చేస్తుంటే.. అంతకంటే ఎక్కువ మంది లోపలే వుండి, దేశాన్ని బలహీనపరుస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.

abvp 
 
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.  ఆపరేషన్ సిందూర్ పై గానీ, జవాన్ల ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా ఎవరు పోస్టులు పెట్టినా, కామెంట్స్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో విద్యా కమిషన్ సభ్యురాలు సూరేపల్లి సుజాతపై ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.