స్వయంసేవకులు అత్యంత సాధారణ జీవితం గడుపుతారు కానీ.. వారి పనితనం ద్వారా అసాధారణ స్థాయికి చేరుకుంటారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. అలాగే వారు చేసే ప్రతి పనీ సమాజ అభ్యున్నతి కోసమేనని, ఆ ప్రయత్నంలోనే నిరంతరం వుంటారని అన్నారు. నాగపూర్ కేంద్రంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జీవనం పార్ట్-1, పార్ట్ -2 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.ఈ పుస్తకాన్ని రామచంద్ర దేవతారే రచించగా, నచికేత్ ప్రకాశన్ ప్రచురించింది.
ఆరెస్సెస్ స్వయంసేవకులు సరళమైన, సాధారణ జీవితాలనే గడుపుతారని, ఇలాగే ఇతరులకు సహాయం కూడా చేస్తారన్నారు. కానీ.. అసాధారణ స్థాయికి చేరుకుంటారన్నారు. కేవలం వారు మాత్రమే అసాధారణ స్థాయికి చేరుకోవడమే కాకుండా సమాజం మొత్తం చేరుకోవాలని కూడా ఆశిస్తారని పేర్కొన్నారు.
స్వయంసేవకులు అత్యంత సరళంగానే మంచి పనులు చేస్తారని, దీని కోసం ప్రత్యేక ప్రయత్నాలంటూ ఏమీ చేయన్నారన్నారు. ఏదో ఒక్కసారి కాకుండా, నిరంతరం ఇలాంటి ప్రయత్నంలోనే వుంటారన్నారు. ఇక.. సంఘ్లో సమష్టి నిర్ణయం తీసుకోవడం ఎందుకు? దాని ప్రాముఖ్యాన్ని కూడా ఆయన వివరించారు. సంస్థ చేసే చర్యలు, ఆదేశాలు, ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
అయితే.. నాయకత్వం పైకి కనిపించవచ్చని, కానీ.. లెక్కలేనంత, పేర్లు పైకి రాని ఓ నిస్వార్థతతో స్వయంసేవకులు పనిచేస్తుంటారని, వారే అత్యంత అంకిత భావంతో సంఘ్ ను ముందుకు నడిపిస్తుంటారని పేర్కొన్నారు. ఇక.. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదని, ప్రత్యక్ష అనుభవాలు ఇందులో కూర్చబడినవని అన్నారు. అనుభవాలు, అభ్యాసాలు ఈ పుస్తకంలో స్పష్టంగా ప్రతిబింబిస్తూనే వుంటాయని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.