భద్రాద్రి రామయ్య భూముల రక్షణకు ప్రభుత్వాలు చొరవ చూపాలి : VHP
VSK Telangana 21-Jul-2025
Total Views |
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాములవారి భూముల రక్షణకు రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని విశ్వహిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది. రాముడి పేరుపై ఉన్న భూముల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం రాములవారి గోశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలని, గోశాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ముఖ్యంగా 2018 నుంచి దేవాలయానికి చెల్లించాల్సిన కౌలు ( డ్యామేజింగ్ చార్జెస్ ) వెంటనే చెల్లించాలని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. పురుషోత్తపట్నం లోని రామయ్య భూములపై పూర్తి హక్కులు భద్రాద్రి దేవస్థానం కే చెందుతాయని విహెచ్పి స్పష్టం చేసింది. ఇందుకు పాలకులు రాజకీయాలకు అతీతంగా స్పందించి, దేవాలయ భూములు కాపాడాలని సూచించింది. ఏది ఏమైనప్పటికీ భద్రాద్రి రాముల వారి అంగుళం భూమి కూడా వదులుకోవడానికి విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా లేదని హెచ్చరించింది. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ వేసి, కబ్జాదారుల నుంచి దేవాలయ భూములకు రక్షణ కల్పించాలని తెలుగు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది. భద్రాద్రి రామాలయం ఈవో పై దాడి జరిగి రోజులు గడుస్తున్నా కూడా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలయ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని విశ్వహిందూ పరిషత్ తేల్చి చెప్పింది. రాములవారి భూములను కాపాడేందుకు తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుందని ఈమేరకు విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది.