డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మహిళల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా ఉత్తర భారతం, దక్షిన భారతం మహిళలు అంటూ విభజించే ప్రయత్నాలకు తెరలేపారు. ఈ సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, మరియు ఓటు బ్యాంకు మద్దతును పొందేందుకు డిఎంకె నాయకులు ఇప్పటికే విభజన వ్యూహాలను అమలు చేశారు.తమిళ సమాజం పంటల పండుగ అయిన ద్రవిడ పొంగల్ను జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే పార్టీ కార్యకర్తలను కోరారు.
తమిళనాడులో అమ్మాయిల్ని చదువుకోవాలని చెబుతుండగా, ఉత్తరాదిలో మాత్రం వారిని వంటగదికి పరిమితమై, పిల్లల్ని కంటే చాలని చెబుతున్నారని దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఉపముఖ్యమంత్రి ఉదయనిధి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో దయానిధి మాట్లాడుతూ.. ‘తమిళనాడులో మేం యువతులను చదుకోవాలని చెబుతున్నాం. కానీ, ఉత్తర భారతంలో ఏం చెబుతున్నారు? అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్లరాదు. ఇంట్లోనే ఉండాలి. వంటగదిలో ఉండాలి. పిల్లల్ని కనాలి. ఇదే మీ పని అని చెబుతున్నారు.’’ అని అన్నారు.
మన అమ్మాయిలు ల్యాప్టాప్ పట్టుకుని చాలా గర్వంగా ఫీలవుతారని, ఇంటర్వ్యూలకు హాజరవుతారని, పీజీ చదువుకుంటారన్నారు. చదువుకోవాలని ప్రోత్సహించడం వల్ల తమిళనాడు అమ్మాయిలు కాన్ఫిడెంట్గా కనిపిస్తారని, కానీ ఉత్తరాదిలో ఏం చేస్తారో తెలుసా, అమ్మాయిలు ఉద్యోగం చేయవద్దు అంటారని, ఇంట్లోనే ఉండాలని చెబుతారని, కిచెన్లో ఉండాలని లేదా పిల్లలు కనాలని అంటారు’’ అని కూడా పేర్కొనడంతో వివాదం రేగుతోంది.