
ఈ మధ్య ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీకి పెళ్లయిందంటూ...వారి కూతురు పేరు రవీనా శర్మ అని, ఆమె రష్యాలో మెడిసిన్ చదువుతోందంటూ రయీస్ ఖాన్ అనే ముస్లింతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టు పై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారతదేశాన్ని హిందూదేశంగా మార్చాలని చూసే వ్యక్తి కూతురే ముస్లింతో ప్రేమలో ఉందంటూ కొందరు అసహ్యంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొందరేమో ఇదంతా అసత్యమని, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ స్పందిస్తున్నారు. నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ బ్రహ్మచారి. వారు నిత్యం దేశసేవలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టు నిజానిజాలేంటో మనం గమనిస్తే.. సదరు మహిళ గుజరాత్కు చెందిన బ్యూటీ నిపుణురాలు డింపుల్ అహుజా అని, ఆమెకు మోహన్ భాగవత్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. డింపుల్ మేనేజర్ మయూర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
గుజరాత్కు చెందిన బ్యూటీషియన్ డింపుల్ అహుజా అనే మహిళ లగ్జరీ సెలూన్ బ్రాండ్ నెయిల్డ్ ఇట్ వ్యవస్థాపకురాలు మరియు CEO కూడా.. డింపుల్ అహుజా అభిమాని ఖాతాలో వైరల్ ఫోటో తీసిన వీడియోను గురించి డింపుల్ మేనేజర్ మయూర్ను సంప్రదించగా... డింపుల్ గుజరాత్లోని బరోడాకు చెందినదని, మోహన్ భాగవత్ కుటుంబంతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. "డింపుల్ వివాహిత, ఆమె భర్త హిందూ పంజాబీ. పోస్ట్లోని కంటెంట్ పూర్తిగా తప్పు. పోస్ట్లోని ఫోటో డింపుల్ తన బ్యూటీ ప్రొడక్ట్స్లో ఒకదానిని ప్రమోట్ చేయడానికి చేసిన వీడియో నుండి తీసుకోబడింది. ఆమె ఫోటోను దుర్వినియోగం చేయడంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు.
కేవలం ఇది మాత్రమే కాదు, 2019 ప్రారంభంలో నటి ఊర్మిళ మోహన్ భాగవత్ మేనకోడలు అని, ముస్లింను వివాహం చేసుకున్నానని పేర్కొంటూ ఒక వాదన వైరల్ అయింది. ఊర్మిళ కాశ్మీరీ మోడల్ మరియు వ్యాపారవేత్త మొహ్సిన్ మీర్ అక్తర్ను వివాహం చేసుకుంది, కానీ ఆమెకు మోహన్ భాగవత్ లేదా ఆయన కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ రకమైన పోస్టులు చూస్తుంటే ఎవరో కావాలనే ఆర్ఎస్ఎస్ పేరు ప్రతిష్టతలను దెబ్బతీయడానికి, సర్సంఘ్చాలక్ జీని తప్పుడు కోణంలో చూపించడానికి చేస్తున్న ప్రయత్నమేనన్నది సుస్పష్టం.