గిరిజన సమాజం, హిందూ సమాజం రెండూ ఒక్కటే : మోహన్ భాగవత్

VSK Telangana    25-Jan-2026
Total Views |
 
ranchi
 
రాంచీలోని దీబిదిహ్ లో ‘‘జనజాతీయ సంవాద్’’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ లోని వివిధ జిల్లాల నుంచి గిరిజన సంఘాల ప్రతినిధులు, వనవాసీ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు హాజరయ్యారు. 32 గిరిజన సంఘాల ప్రతినిధులు మరియు సామాజిక ప్రముఖులు హాజరయ్యారు. సంభాషణ కార్యక్రమం రెండు సెషన్లలో జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. మొదటగా భారత మాత చిత్రపటానికి పుష్పార్చన చేసి, దీపం వెలగించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
మొదటి సెషన్ లో మోహన్ కచ్చప్ సమన్వయం చేశారు. భగవాన్ బిర్సాముండా 150 వ జయంతిని పురస్కరించుకొని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే సందేశాన్ని మోహన్ కచ్చప్ చదివి వినిపించారు. అలాగే వనవాసీ సమాజానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. అలాగే CNT/SPT చట్టాన్ని ఉల్లంఘించి గిరిజన భూముల అమ్మకం మరియు కొనుగోలు, ముస్లిం, క్రైస్తవ మత మార్పిళ్లు, పెసా చట్టం అమలులో లోపాలు, గ్రామ సభ అధికారాలు, గిరిజన మహిళలు, బాలికపై సామాజిక, సాంస్కృతిక దోపిడీ వంటి అంశాలపై చర్చించారు.
 
ఇక... రెండో సమావేశంలో సర సంఘచాలక్ మోహన్ భాగవత్ మార్గనిర్దేశనం చేశారు. గిరిజన సమాజం, హిందూ సమాజం రెండూ భిన్నంగా వుండవని, రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. హిందూ అంటే కేవలం పూజా పద్ధతి మాత్రమే కాదని, జీవన శైలి అని అన్నారు. భారత్ లో వైవిధ్యత వున్న మాట వాస్తవమేనని, అయినతే.. ఐక్యతా భావాన్ని ప్రదర్శిస్తారన్నారు.
 
వేల సంవత్సరలుగా భారతీయ నాగరికత అడవులు, వ్యవసాయం, ప్రకృతితో సామరస్యతతోనే నడుస్తూ అభివృద్ధి సాధిస్తోందన్నారు. వేదాలు, ఉపనిషత్తుల మూలం కూడా ఈ అటవీ సంప్రదాయంతో ముడిపడి వుందన్నారు. అన్ని భాషలు, సంస్కృతులు, సమాజాలను పోషించే తల్లి భూమి అని, అందుకే వైవిధ్యాన్ని గౌరవించడం మన సంప్రదాయమని వివరించారు. మతం ప్రాథమిక అర్థం సత్యం, సేవ, దాన ధర్మాలని, నిగ్రహమని అన్నారు. సమాజం సుఖం, స్వార్థంలో చిక్కుకున్న సమయంలో పరస్పరం అంతరాలు పెరిగాయని, దీనిని విదేశీ దురాక్రమణదారులు ఆసరాగా చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఒకే ఒక మతం వుందని, అదే మానవత్వమని, అదే హిందూ మతం సారాంశమని అన్నారు.
 
సమాజం విడిపోతే బలహీనపడుతుందని, ఐక్యంగా వుంటే ఏ శక్తి కూడా సమాజానికి హాని చేయలేదని మోహన్ భాగవత్ పునరుద్ఘఘాటించారు. సంఘ్ లక్ష్యం సమాజాన్ని విభజించడం కాదని, సమాజాన్ని ఏకం చేయడమే సంఘ్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.