రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శిక్షణా శిబిరంలో పర్యావరణ స్పృహను, సామాజిక బాధ్యతను చాటిచెప్పే ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. షాజపూర్ శిబిరంలో నిర్వహించిన "మాతృ హస్త భోజనం" కార్యక్రమంలో భాగంగా షాజాపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన 187 కుటుంబాల మాతృమూర్తులు స్వచ్చందంగా పాల్గొన్నారు. కఠిన శిక్షణలో ఉన్న స్వయంసేవకులను తమ సొంత బిడ్డలుగా భావించి, మాతృమూర్తులు వారి వారి ఇళ్ల నుండి స్వహస్తాలతో వండి తెచ్చిన రకరకాల వంటకాలను వారు ఆత్మీయంగా మన స్వయంసేవకులకు వడ్డించారు.
అయితే, ఈ కార్యక్రమం కేవలం భోజన వడ్డనతోనే ముగిసిపోలేదు. తమపై చూపిన అపారమైన మాతృత్వపు ప్రేమకు కృతజ్ఞతగా శిబిర నిర్వాహకులు ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఇచ్చే సాంప్రదాయక బహుమతులకు భిన్నంగా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ, వచ్చిన 187 మంది తల్లులకు రిటర్న్ గిఫ్ట్స్ కింద పండ్ల మొక్కలను అందజేశారు.
ఈ పచ్చని మొక్కలను ఆయా కుటుంబాలు తమ ఇళ్ల ప్రాంగణాల్లో నాటి, సంరక్షించాలని నిర్వాహకులు కోరారు. ఒకవైపు సామాజిక సమరసతను, మరోవైపు ప్రకృతి రక్షణను, కుటుంబ ప్రభోధన్ ను ఏకకాలంలోనే సమాజానికి చూపిన ఈ వినూత్న ప్రయత్నం స్థానికంగా అందరి ప్రశంసలను అందుకుంటోంది.