జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఆలపించేటప్పుడు అగౌరవంగా ప్రవర్తించినా, అడ్డుకున్నా మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం సెక్షన్ 3 ను సవరించనున్నారు. దీని ఫలితంగా
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ‘‘వందేమాతరం’’ అడ్డుకుంటే వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు లేదా భారీ జరిమానా విధిస్తారు. తీవ్రతను బట్టి, రెండూ విధించవచ్చు.
ఎవరైనా ఈ ఉల్లంఘనకు మళ్ళీ పాల్పడితే, కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష తప్పనిసరి. జాతీయ గీతానికి నిర్దేశించిన నియమాలు, ఆంక్షలే వీటికి కూడా వర్తిస్తాయి.
జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971ను సవరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా వందేమాతరం పాడేటప్పుడు అవమానించినా, దానికి విఘాతం కలిగించినా లేదా అడ్డుకున్నా కఠినమైన శిక్షలు విధించనున్నారు.
1971 నాటి అసలు చట్టం ప్రకారం.. కేవలం జాతీయ గీతం (జనగణమన), జాతీయ పతాకం (త్రివర్ణ పతాకం), భారత రాజ్యాంగాన్ని అవమానించడం మాత్రమే చట్టరీత్యా నేరం. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని ఆలపించకుండా అడ్డుకున్నా లేదా పాడుతున్నప్పుడు ఆటంకం కలిగించినా గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే నిబంధన ఉంది.