వైద్య వృత్తిపై మరింత సేవా భావాన్ని పెంచిన ‘‘సేవా భారతి ఛారిటబుల్ హాస్పిటల్ సందర్శన’’

VSK Telangana    16-Jun-2026
Total Views |

seva 
 
వివిధ వైద్య కళాశాలలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు సేవాభారతి ఛారిటబుల్ హాస్పిటల్ సందర్శించారు.సేవాంకుర్ భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు, మహేశ్వర మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, ESI మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు, అలాగే సిరిసిల్ల GMC నుండి ఒకరు, సిద్దిపేట GMC నుండి ఇద్దరు విద్యార్థులు పాల్గొన్నారు.
 
ఆరు వైద్య కళాశాలలకు చెందిన 16 మంది వైద్య విద్యార్థులు, ఆరుగురు వైద్యులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హేమంత్, డాక్టర్ జయ సందేశ్, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వేదప్రకాష్, డాక్టర్ సురేంద్ర రెడ్డి సహా కొంతమంది కన్సల్టెంట్ డాక్టర్లు మార్గదర్శకత్వం వహించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వ్యక్తిత్వ వికాస కార్యశాల చర్చలతో పాటుగా జీవిత నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకున్నారు. అలాగే బృంద చర్చలు కూడా జరిగాయి.

seva2 
 
వైద్య వృత్తిలో నైతిక విలువల ప్రాముఖ్యత గురించి డాక్టర్ వేదప్రకాష్ చేసిన పరిచయ ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒక మంచి వైద్యుడిగా ఉండటమంటే కేవలం జ్ఞానం, నైపుణ్యాలు కలిగి ఉండటమే కాకుండా, రోగుల పట్ల నిజాయితీ, కరుణ, బాధ్యతను కలిగి ఉండటం కూడా అని ఆయన మాటలు గుర్తుచేశాయి. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ కళాశాల విద్యార్థులు తమ అనుభవాన్ని పంచుకున్నారు.‘‘పాల్గొన్న వైద్య విద్యార్థులందరికీ ఒక విశిష్టమైన, విజ్ఞానదాయకమైన అనుభవాన్ని అందించింది. పాఠ్యపుస్తకాలకు అతీతంగా చూడటానికి, వైద్య వృత్తిలో సేవ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మాకు ఒక అవకాశాన్ని కల్పించింది" అని పేర్కొన్నారు.

seva23 
 
"మాకు ఆసుపత్రిని చూపిస్తూ, దాని పనితీరును వివరించారు. బృంద చర్చల సమయంలో ఉత్సాహం, చురుకైన సంభాషణ సమావేశాలను ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా మార్చాయి. ఆసుపత్రిలోని NICU అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న డాక్టర్ లక్ష్మి మేడమ్‌ను కూడా మాకు పరిచయం చేశారు. ఇది ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో ఆ సంస్థకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యంపై సామాజిక, డిజిటల్ మాధ్యమాల ప్రభావంపై జరిగిన బృంద చర్చ ఆలోచనలను రేకెత్తించడమే కాకుండా, డిజిటల్ ఆరోగ్య సమాచారం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు సవాళ్లు రెండింటిపైనా విమర్శనాత్మకంగా ఆలోచించేలా మమ్మల్ని ప్రోత్సహించింది" అని విద్యార్థులు చెప్పారు.
 
ఇంకా.. "ఆయుష్ గారు నిర్వహించిన వ్యక్తిత్వ వికాసం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్వామి వివేకానంద జీవితంలోని ఉదాహరణల ద్వారా ఆయన 'సేవ' అర్థాన్ని వివరిస్తూ, సమాజానికి తిరిగి ఏదైనా అందించడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు. నేటి ప్రపంచంలో కూడా దయ, సేవ, మానవత్వానికి ఎంతో విలువ ఉందన్న విషయాన్ని ఆయన సందేశం మనకు గుర్తుచేసింది’’ అని తమ అనుభవాలను పంచుకున్నారు.
 
మహారాష్ట్రలో 26 సంవత్సరాల క్రితం ప్రారంభమై స్వచ్ఛందంగా వైద్య సేవలందిస్తున్న సేవాంకుర్ భారత్ ద్వారా ఈ విద్యార్థులు సేవాభారతి ఆస్పత్రి సందర్శనకు వచ్చారు. దాదాపుగా అన్ని మెడికల్ కాలేజీలో ఈ సేవాంకుర్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ ప్రాంతాలకు విస్తరించింది. అన్ని వైద్య విభాగాలకు చెందిన మెడికల్ స్టూడెంట్స్ ఇందులో వుంటారు. దీని ద్వారా జాతీయ భావాలను విస్తరించడంతో పాటు సేవ పట్ల మరింత శ్రద్ధ పెరిగేలా చేస్తుంటారు. అలాగే మారుమూల గ్రామాలకు వెళ్లి, సేవాంకుర్ భారత్ ఆధ్వర్యంలో వీరు వైద్య సేవలు అందిస్తుంటారు.