భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 18 న ఉప రాష్ట్రపతి భవన్ లో "RSS @100: A Century of Service, Unity & Sacrifice" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అనుపమ్ త్రివేది రచించారు. ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు వ్యక్తిగతంగా గౌరవమని అన్నారు. సంఘ్ గురించి ఒక తమిళ కవితను ప్రస్తావిస్తూ, ఆ కవిత ఈ సంస్థను పవిత్ర గంగానదితో పోల్చిందని ఆయన చెప్పారు; ఇతరుల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా ప్రవహించే గంగానది అని, సంఘ్ తన శతాబ్ద కాల ప్రయాణంలో అనుసరించిన సేవా భావనకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన వివరించారు.
ఈ పుస్తకంలో ఆరెస్సెస్ స్ఫూర్తిని చాలా చక్కగా ఆవిష్కరించారని, అందుకు రచయితను ప్రశంసించారు. భారత్ యొక్క సాంస్కృతిక మూలాలు, వారసత్వం మరియు సంప్రదాయాలను పునరుద్ధరించడం, బలోపేతం చేయడం మరియు పునర్నిర్మించడమే సంఘ్ ప్రస్థానమని అన్నారు. 'సేవ, ఐక్యత, త్యాగం' అనే పుస్తక శీర్షికను ప్రస్తావిస్తూ, ఈ ఆదర్శాలు తరతరాల వాలంటీర్లకు స్ఫూర్తినిచ్చాయని ఆయన అన్నారు.
సేవ అనేది సమాజం పట్ల నిస్వార్థమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోందని, ఐక్యతా భావన అనేది దేశ భాష, సాంస్కృతిక వైవిధ్యాలకు అతీతమైన బంధాలను బలపరుస్తుందన్నారు. అలాగే అంకితభావం, పట్టుదల, నిస్వార్థ కృష్టితోనే సంస్థలు శాశ్వతంగా నిలబడతాయని అన్నారు. అలాగే నిత్య శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం చేస్తోందని నొక్కి చెప్పారు. యువతలోని ముడి శక్తిని జాతీయ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దే కార్యశాలే శాఖ అని అభివర్ణించారు. ఒక వ్యక్తికి అప్పగించిన ప్రతి బాధ్యతనూ అంకితభావంతో, అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా ఆ బాధ్యత గౌరవాన్ని ఇనుమడింపజేయడమే స్వయంసేవక్ అసలైన లక్షణమని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ నాగరిక వారసత్వం, విభిన్న సంప్రదాయాలు, భాషలు మరియు ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల గర్వాన్ని పెంపొందించడం ద్వారా ఆర్ఎస్ఎస్ నిరంతరం సాంస్కృతిక కొనసాగింపును, జాతీయ చైతన్యాన్ని ప్రోత్సహించిందని చెప్పారు. లక్షలాది మంది వాలంటీర్ల అంకితభావాన్ని గుర్తించడానికి ఈ శతాబ్ది ఉత్సవాలు ఒక సందర్భమని ఆయన పేర్కొన్నారు. తమకంటే గొప్ప ఆశయాల కోసం పనిచేయాలనే సామాన్య ప్రజల దృఢ విశ్వాసం, నిబద్ధత మరియు సంసిద్ధతతో నిలబడినప్పుడే సంస్థలు మనుగడ సాగిస్తాయని ఆయన అన్నారు.