
దివంగత 'డిప్యూటీ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా' పసల పున్నారావు శ్రద్ధాంజలి సభ విజయవాడలో జరిగింది. సామాజిక సమరసత వేదిక ఆంధ్రప్రదేశ్, న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకి జస్టిస్ దేవానంద్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సభకు సుమారు 400 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ డిప్యూటి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లాంటి కీలక పదవిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మొదటి సారి అవకాశం లభించిందని, ఇందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు ప్రకటించారు. పసల పున్నారావు అందరితో అత్యంత ప్రేమగా ఉండేవారని అన్నారు. అయితే కేసును వాదించే క్రమంలో మాత్రం రాజీలేని ధోరణినే ప్రదర్శించేవారని అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తగా, సమస్యల పరిష్కారంలో ఉద్యమకారునిగా, సామాజిక కార్యకర్తగా, సమరసతా వేదిక కార్యకర్తగా పనిచేసేవారని అన్నారు. 20 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయవాదిగా ఉంటూ, సామాజిక న్యాయం కోసం పనిచేస్తూ, తనదైన ముద్ర వేశారన్నారు.
బ్రెయిన్ కేన్సర్కి గురైనా, ఎవరి నుంచీ ఆర్థిక సాయం తీసుకోలేదని, స్వాభిమానంతో జీవించారని కొనియాడారు. డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా నియామకం అయిన రెండు సంవత్సరాలకే మృత్యువాతపడటం శోచనీయం అని అన్నారు. అయితే వారి స్థానంలో మరో ఎస్సీ న్యాయవాదినే ఆ స్థానంలో నియామకం జరిగేట్లు న్యాయవాద పరిషత్ కృషి చేయడం అభినందనీయమని జస్టిస్ దేవానంద్ అన్నారు.