400 పాకిస్తానీ ఆధారితో సోషల్ హ్యాండిల్స్ పై ఢిల్లీ పోలీసుల నిఘా

VSK Telangana    03-Aug-2026
Total Views |
 
jantar
 
న్యూఢిల్లీ : జంతర్ మంతర్ దగ్గర నిరసనల సమయంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. అయితే.. కేవలం సోషల్ మీడియాపైనే కాకుండా విచారణ ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు, విదేశీ డిజిటల్ నెట్ వర్క్ లకూ విస్తరించింది.
 
పాకిస్తాన్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 180 ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు యూట్యూబర్ ఖాతాలు, దాదాపు మూడు ప్రైవేట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు, మరియు 400కు పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
 
జంతర్ మంతర్ దగ్గర వున్న వాస్తవ పరిస్థితులను ప్రచారం చేయకుండా, ఓ పెద్ద సంక్షోభం నడుస్తోంది అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేశారు. ఏక కాలంలో ఈ తప్పుడు కంటెంట్ ను ఈ హ్యాండిల్స్ ప్రచారం చేసి వుండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోంది; ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఇన్‌ఫ్లుయెన్సర్, కంపెనీ లేదా ఖాతా వివరాలను అధికారులు బహిరంగంగా వెల్లడించలేదు. ఈ ఆరోపణలు పోలీసుల విచారణ ప్రక్రియలో భాగంగా ఉన్నవే తప్ప, వీటిని ఇంకా న్యాయస్థానంలో ధృవీకరించలేదు.
 
ఆపరేషన్ సిందూర్' వంటి ఆన్‌లైన్ కార్యకలాపాలు ఉధృతంగా సాగిన గత సందర్భాల్లో క్రియాశీలకంగా ఉన్న విదేశీ ఖాతాలే, జంతర్ మంతర్ నిరసనల సమయంలోనూ మళ్లీ కనిపించాయన్న అంశంపై దర్యాప్తు అధికారులు విచారణ సాగిస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనకారుల్లో వున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకొని, మన దేశంలో సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలను పెంచే లక్ష్యంతోనే విదేశీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ కుట్రకు తెరలేపినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.
 
మరోవైపు దర్యాప్తు సంస్థలు ఆర్థిక కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఈ ఏజెన్సీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం ఎవరు చేశారన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే.. దీనిలో పీర్-టు-పీర్ క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, అనుబంధ ప్రకటనల క్రెడిట్‌లు, థర్డ్-పార్టీ మార్కెటింగ్ కన్సల్టెన్సీ రిటైనర్‌లతో పాటు అసలు సరైన పత్రాలు లేకుండా, చెల్లింపులు కూడా జరిగినట్లు ప్రాథమికంగా కనుగొన్నారు.
 
ఒకే విషయాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ వెంట వెంటనే రీపోస్ట్ చేశాయా? ప్రచారం చేశాయా? అన్న విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే రకమైన కథనాలకు సంబంధించిన అనేక విభిన్న రూపాలను ఏకకాలంలో సృష్టించడానికి ఏఐ-ఆధారిత సాధనాలను ఉపయోగించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.